Monday, July 21, 2014

కేంద్ర బడ్జెట్ 2014 - 15

జులై - 10,2014
కేంద్ర బడ్జెట్ 2014 - 15
¤  రూ.17,94,892 కోట్ల వార్షిక వ్యయ అంచనాలతో ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ 2014-15 కేంద్ర బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. వ్యవసాయ, పారిశ్రామిక రంగాల బలోపేతానికి ముఖ్య చర్యలను ప్రతిపాదించారు. రంగాలవారీగా ప్రాథమ్యాలను సభ ముందు ఉంచారు.    
»    ప్రజల్లో పెరుగుతున్న ఆకాంక్షలను తమ ప్రభుత్వం అనుసరించే అభివృద్ధి వ్యూహంలో 'అందరితో కలిసి .... అందరి వికాసానికి (సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్)' విధానంలో ప్రతిఫలిస్తామని ఆర్థిక మంత్రి తన ప్రసంగంలో వెల్లడించారు.     
»    'కనిష్ఠ ప్రభుత్వం - గరిష్ఠ పాలన' లక్ష్యానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు మంత్రి ప్రకటించారు. వ్యయ సంస్కరణలకు తీసుకోవాల్సిన చర్యలను సూచించడానికి ప్రభుత్వం వ్యయ నిర్వహణ కమిషన్‌ను ఏర్పాటు చేస్తుందని ప్రకటించారు. ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఈ కమిషన్ మధ్యంతర నివేదికను సమర్పిస్తుంది. ఆహార, చమురు రాయితీలు సహా రాయితీల విధానాన్ని సంస్కరించాలని ప్రతిపాదించారు. అణగారిన వర్గాలు, పేదలు, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఈ విషయంలో రక్షణలు కొనసాగిస్తూ... లక్షిత వర్గాలకు సక్రమంగా రాయితీలు అందేలా మార్పులు చేస్తూ యూరియా కొత్త విధానాన్ని రూపొందిస్తున్నట్లు మంత్రి ప్రకటించారు.    
»    ప్రస్తుతం రూ.4 లక్షల కోట్లకు పైగా పన్ను డిమాండ్‌పై వివిధ న్యాయస్థానాలు, అప్పిలేట్ అథారిటీల్లో వివాదాలు నడుస్తున్నాయి. దేశంలోని పన్ను చెల్లింపుదారులకు ఇది ఆందోళన కలిగించే విషయం. ప్రత్యక్ష పన్నుల్లో న్యాయ వివాదాలను తగ్గించడానికి చట్టపరమైన, పరిపాలనారమైన మార్పులు అవసరం. పరిపాలనాపరమైన చర్యల్లో భాగంగా పన్ను చట్టాల్లో ఎక్కడెక్కడ స్పష్టత అవసరమో గుర్తించడానికి ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు. వాణిజ్య, పారిశ్రామిక వర్గాలతో ఈ కమిటీ నిరంతరం భేటీ అవుతూ సూచనలు స్వీకరిస్తుంది. ఈ కమిటీ చేసిన సిఫారసుల ఆధారంగా సీబీడీటీ, ఎక్సైజ్, కస్టమ్స్ కేంద్ర బోర్డు (సీబీఈసీ) రెండు నెలల్లో తగిన వివరణలు ఇస్తుంది.    
»    భారత ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనకారిగా ఉండేలా ఎంపికచేసిన రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) ప్రోత్సహించాలన్నది ఎన్‌డీఏ ప్రభుత్వ విధానం. రక్షణ రంగంలో 26 శాతం ఎఫ్‌డీఐలకు అనుమతి ఉండగా దీన్ని 49 శాతానికి పెంచారు. బీమా రంగంలో ప్రస్తుతం ఎఫ్‌డీఐలపై 26 శాతం పరిమితి ఉండగా దీన్ని 49 శాతానికి పెంచాలని ప్రతిపాదించారు.

2014 - 15 కేంద్ర బడ్జెట్‌లో వివిధ రంగాలకు కేటాయింపులు
 ఆరోగ్య రంగం:     
»    అందరికీ ఆరోగ్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఎన్‌డీఏ ప్రభుత్వం బడ్జెట్‌లో పలు చర్యలను ప్రకటించింది. ఉచితంగా మందులు, వైద్య పరీక్షలు లాంటి ముఖ్యమైన సేవలను అందుబాటులోకి తేనున్నారు.   
»    2014-15 ఆర్థిక సంవత్సరంలో వైద్య ఆరోగ్య రంగానికి రూ.35,163 కోట్లు కేటాయించారు. 2013-14లో సవరించిన అంచనా ప్రకారం ఈ కేటాయింపులు రూ.27,531 కోట్లు.   
»    గ్రామీణ ప్రాంతాల్లో 15 ఆదర్శ ఆరోగ్య పరిశోధనా కేంద్రాల ఏర్పాటు.    
»    ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లలో ఎయిమ్స్ తరహా ఆసుపత్రుల నిర్మాణానికి రూ.500 కోట్లు.    
»    జాతీయ ఆరోగ్య కార్యక్రమం (ఎన్‌హెచ్ఎమ్)కు రూ.21,912 కోట్లు కేటాయింపు.    
»    కొత్తగా 12 ప్రభుత్వ వైద్య కళాశాలల ఏర్పాటు.    
»    రాష్ట్రాల ఔషధ, ఆహార తనిఖీ విభాగాల పటిష్టానికి నిధుల కేటాయింపు.  
 »    దేశంలో ఆందోళనకర స్థాయిలో పెరిగిపోతున్న పోషకాహార లోపం సమస్యపై యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోనున్నట్లు ప్రకటించారు.    
»    మనదేశంలో మొత్తం 5.76 లక్షల పడకల సామర్థ్యంతో 12,760 ప్రభుత్వ అలోపతి ఆసుపత్రులు ఉన్నాయి. అమెరికాలో ప్రతి వెయ్యిమందికి సగటున 3.1 ఆసుపత్రి పడకలు ఉంటే, చైనాలో మూడు ఉన్నాయి. మన దగ్గర మాత్రం ప్రతి వెయ్యిమందికి ఒకటి కూడా లేదు.    
»    దేశవ్యాప్తంగా వైద్యులు, నర్సుల కొరత తీవ్రంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇది మరింత అధికం.

స్త్రీ, శిశు సంక్షేమం:     
»    బడ్జెట్‌లో ఈ రంగానికి రూ.21,193.88 కోట్లు కేటాయించారు. 2013-14 సవరించిన అంచనాల ప్రకారం ఇది రూ.18,285.65 కోట్లుగా ఉంది.    
»    ఆడపిల్లల పట్ల వివక్షను, ఉదాసీనతను పరిగణనలోకి తీసుకున్న మోడీ సర్కారు ఒక వినూత్న పథకాన్ని ప్రారంభించింది. 'బేటీ బచావో .... బేటీ పఢావో' అనే ఈ పథకానికి రూ.100 కోట్లు కేటాయింపు.  
 »    మహిళలపై పెరుగుతున్న నేరాలు, పెనుసవాలుగా మారిన వారి భద్రత నేపథ్యంలో పెద్ద నగరాల్లో మహిళలకు మరింత రక్షణ కల్పించేందుకు రూ.150 కోట్లు.    
»    ప్రభుత్వ రోడ్డు రవాణా వ్యవస్థలో మహిళల భద్రతకు ఉద్దేశించిన ప్రయోగాత్మక పైలట్ పథకానికి రూ.50 కోట్లు.  
 »    ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాదేశిక ప్రాంతం (ఎన్‌సీఆర్) పరిధిలోని అన్ని జిల్లాల్లో ఈ ఏడాది సంక్షోభ నిర్వహణ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదన - ఆయా ప్రాంతాల్లోని ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రుల్లో వీటి ఏర్పాటు. నిర్భయ నిధి నుంచి నిధుల కేటాయింపు.    
»    జాతీయ గ్రామీణ జీవనోపాధి పథకం 'ఆజీవిక' కింద మహిళా స్వయం సహాయక సంఘాలకు నాలుగు శాతం వడ్డీతో ఇస్తున్న బ్యాంక్ రుణ వసతిని మరో వంద జిల్లాలకు పొడిగింపు.    
»    ఆడపిల్లల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యతను ఇస్తూ వారి అభ్యున్నతి కోసం ప్రత్యేక చిన్నతరహా పొదుపు పథకం. వారి చదువు, పెళ్లి కోసం ఉపయోగపడేలా రూపకల్పన.    
»    ఆడపిల్లల భద్రత, సంక్షేమమే ప్రధానం. వారి పట్ల వివక్షను దూరం చేయడానికి పాఠశాల స్థాయి నుంచే బోధనాంశాల ద్వారా ఈ దిశగా చైతన్య సాధనకు కృషి.

పర్యటక రంగం:     
»    ఈ ఆర్థిక సంవత్సరంలో పర్యటక రంగానికి రూ.1,966.71 కోట్లు కేటాయించారు. 2013-14 సవరించిన బడ్జెట్ అంచనాల ప్రకారం ఇది రూ.1,050.31 కోట్లుగా ఉంది.    
»    దేశ సాంస్కృతిక సుసంపన్నతను, చరిత్రాత్మక, మత, సహజసిద్ధమైన వారసత్వాన్ని సంరక్షించుకోవడంతో పాటు భారీగా ఉపాధి కల్పనకు అవకాశమున్న పరిశ్రమగానూ పర్యటక రంగాన్ని గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం తాజా బడ్జెట్‌లో అందుకు అనుగుణంగా నిధులు కేటాయించింది. ప్రత్యేక ఇతివృత్తాలతో అయిదు పర్యటక వలయాలను (టూరిస్ట్ సర్క్యూట్స్) ఏర్పాటు చేసేందుకు రూ.500 కోట్ల కేటాయింపునకు ఆర్థికమంత్రి జైట్లీ ప్రతిపాదించారు. మరికొన్ని కొత్త పథకాలను కేటాయించారు.    
»    జాతీయ వారసత్వ నగర అభివృద్ధి, ఉద్ధరణ (నేషనల్ హెరిటేజ్ సిటీ డెవలప్‌మెంట్ అండ్ ఆగ్‌మెంటేషన్ యోజన - హృదయ్) పథకాన్ని మథుర, అమృత్‌సర్, గయ, కాంచీపురం, వేళాంకనీ, అజ్మీర్‌లలో ఈ ఆర్థిక సంవత్సరంలోనే ప్రారంభిస్తారు. దీనికి రూ.200 కోట్లు కేటాయించారు. ప్రభుత్వం, విద్యాసంస్థలు, స్థానికుల భాగస్వామ్యంతో దీన్ని అమలుపరుస్తారు.   
»    జాతీయ తీర్థయాత్రల పునరుద్ధరణ, ఆధ్మాత్మిక ఉద్ధరణ కార్యక్రమం (నేషనల్ మిషన్ ఆన్ పిలిగ్రిమేజ్ రెజువనేషన్ అండ్ స్పిరిచ్యువల్ ఆగ్‌మెంటేషన్ డ్రైవ్ - ప్రసాద్) ప్రారంభం. దీనికోసం రూ.100 కోట్లు కేటాయించారు.   
»    పురావస్తు ప్రాధాన్య ప్రాంతాల పరిరక్షణకు రూ.100 కోట్లు.  
 »    సారనాథ్ - గయ - వారణాసి ప్రాంతాలను బౌద్ధ పర్యటక వలయంగా అభివృద్ధి చేయడం. ప్రపంచ పర్యాటకులను ఆకట్టుకునేలా అత్యాధునిక వసతులను ఈ ప్రాంతాల్లో అభివృద్ధి చేయడం.    
»    అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షిస్తున్న గోవాలో ప్రపంచస్థాయి ప్రమాణాలతో కన్వెన్షన్ సెంటర్ అభివృద్ధికి ప్రతిపాదన.  
 »    2012లో మనదేశం పర్యటకరంగం ద్వారా రూ.6,40,000 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఇది దేశ జీడీపీలో 6.6 శాతం. ఈ రంగం దాదాపు నాలుగు కోట్ల మందికి ఉపాధి కల్పిస్తోంది. పర్యాటక రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రపంచ దేశాల్లో భారత్ ఒకటి.

రోడ్డు రవాణా, జాతీయ రహదారులు:   
 »    2014 - 15 ఆర్థిక సంవత్సరానికి రూ.34,345.20 కోట్లు కేటాయించారు. 2013-14 సవరించిన బడ్జెట్ అంచనాల ప్రకారం ఇది రూ.30,338.53 కోట్లుగా ఉంది.    
»    భారత్ లాంటి పెద్ద దేశంలో భౌగోళికంగా చాలా దూరంగా ఉన్న నగరాలకు వేగంగా చేరుకునేందుకు అనువైన రవాణా నెట్‌వర్క్ ఉండాలని ప్రభుత్వం సంకల్పించింది. దీనివల్ల వివిధ నగరాల ద్వారా సరకు రవాణా నెట్‌వర్క్ కూడా వృద్ధి చెందుతుంది. జాతీయ రహదారులకు 'అనుమతుల అవరోధాల' నుంచి విముక్తి కల్పించనున్నట్లు అరుణ్‌జైట్లీ బడ్జెట్‌లో ప్రకటించారు.    
»    జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్ఏఐ), రాష్ట్ర రోడ్లకు రూ.37,880 కోట్ల కేటాయింపు. ఇందులో ఈశాన్య రాష్ట్రాలకు రూ.3 వేల కోట్లు.    
»    పారిశ్రామిక కారిడార్లకు సమాంతరంగా ఎంపిక చేసిన ఎక్స్‌ప్రెస్‌వే లపై పని ప్రారంభిస్తామని ప్రకటించారు. ఈ ప్రాజెక్టు రూపకల్పన కోసం రూ.500 కోట్లను ఎన్‌హెచ్ఏఐ కేటాయిస్తుంది.    
»    ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 8500 కిలోమీటర్ల జాతీయ రహదారి నిర్మాణాన్ని సాధిస్తామని ప్రకటించారు.
 

గ్రామీణాభివృద్ధి:  
 »    గ్రామీణాభివృద్ధికి ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.80,093.33 కోట్లు కేటాయించారు. 2013-14 సవరించిన బడ్జెట్ అంచనాల ప్రకారం ఇది రూ.59,355.05 కోట్లుగా ఉంది.    
»    గ్రామీణాభివృద్ధికి మోడీ సర్కారు పెద్దపీట వేసింది. యూపీఏ హయాంలో ప్రవేశపెట్టిన మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లోని సకల సదుపాయాల మెరుగుకు భారీగా నిధులు వెచ్చించనున్నట్లు ప్రకటించింది.    
»    మంచినీరు, రోడ్లు, వాటర్‌షెడ్లు, ఇళ్ల నిర్మాణం... ఇలా అనేక రకాల పథకాలకు భారీగా నిధులు కేటాయించింది.    
»    గుజరాత్‌లో విజయవంతమైనట్లుగా దేశంలోని మిగతా ప్రాంతాల్లో కూడా గ్రామాల్లో పట్టణ సదుపాయాల కల్పన కోసం 'శ్యాంప్రసాద్ ముఖర్జీ' పేరిట కొత్త పథకాన్ని ప్రకటించింది.    
»    గ్రామాల్లోనూ ఇంటర్నెట్ సౌకర్యం కల్పించడం కోసం 'డిజిటల్ ఇండియా'; వచ్చే అయిదేళ్లలో దేశంలో నివాస ప్రాంతాలన్నీ పరిశుభ్రంగా ఉండేలా తీర్చిదిద్దే 'స్వచ్ఛ భారత్' లాంటి పథకాల ప్రకటనతో పాటు యూపీఏ కలల పథకమైన గ్రామీణ ఉపాధి హామీ పథకానికి రూ.33,364 కోట్లు కేటాయించింది. గతేడాది మన్మోహన్ ప్రభుత్వ హయాంలో కూడా ఇంతే మొత్తం కేటాయించడం గమనార్హం.    
»    గతంలో ఎన్‌డీయే హయాంలో వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు ప్రకటించిన ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన (పీఎంజీఎస్‌వై)కి రూ.14,389 కోట్లు కేటాయించారు.    
»    స్వయం సహాయక మహిళలకు 4 శాతం వడ్డీకి రుణాలు అందజేసే 'ఆజీవిక' పథకాన్ని మరో 100 జిల్లాలకు విస్తరిస్తారు. ప్రస్తుతం సకాలంలో రుణాలను తిరిగి చెల్లించే మహిళలకు 7 శాతానికి బదులు 4 శాతం మాత్రమే వడ్డీని వసూలు చేసే ఈ పథకం ప్రస్తుతం 150 జిల్లాల్లో అమలవుతోంది.    
»    గ్రామీణ ప్రాంతాల్లో గృహనిర్మాణం కోసం సహాయపడే గ్రామీణ గృహ నిధి (రూరల్ హౌసింగ్ ఫండ్ - ఆర్‌హెచ్ఎఫ్)ను పటిష్టపరచడం కోసం జాతీయ గృహ నిర్మాణ బ్యాంక్ ఏర్పాటు లేదా ఎరువులు, పురుగు మందులతో నీరు కలుషితమయ్యే ప్రాంతాల్లో రక్షిత మంచినీటి పథకాలు, జలశుద్ధి కేంద్రాల ఏర్పాటు.    
»    'నీరాంచల్' వాటర్‌షెడ్ల పథకానికి రూ.2,142 కోట్లు, జాతీయ గృహనిర్మాణ బ్యాంక్‌కు రూ.8,000 కోట్లు, రహదారుల మెరుగుకు రూ.14,389 కోట్లు, మంచినీటి సరఫరా పథకాలకు రూ.3,600 కోట్లు కేటాయించారు.

ప్రాథమిక విద్య:     
»    ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రాథమిక విద్యకు రూ.55,115.10 కోట్లు కేటాయించారు. 2013-14 బడ్జెట్ సవరించిన అంచనాల ప్రకారం ఇది రూ.50,136.30 కోట్లుగా ఉంది.    
»    ప్రాథమిక విద్య తమ ప్రధాన లక్ష్యాల్లో ఒకటని ఎన్డీయే ప్రభుత్వం పేర్కొంది. తొలిదశలో అన్ని బాలికల పాఠశాలల్లో తాగునీరు, మరుగుదొడ్డి సదుపాయం కల్పిస్తామని ఆర్థిక మంత్రి ప్రకటించారు. మొత్తంగా విద్యారంగానికి గత ఆర్థిక సంవత్సరం కంటే 11 శాతం కేటాయింపులు పెరిగాయి.  
 »    పాఠశాల విద్య, అక్షరాస్యత విభాగాలకు రూ.51,828 కోట్లు కేటాయించారు. (విద్యా రంగం మొత్తానికి రూ.68,728 కోట్లు)    
»    సర్వశిక్ష అభియాన్‌కు రూ.28,635 కోట్లు.    
»    రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్‌కు రూ.4,966 కోట్లు.    
»    ఉపాధ్యాయుల్లో ప్రేరణకు, నూతన బోధనా విధానాల అభివృద్ధికి 'పండిట్ మదన్‌మోహన్ మాలవ్య' పేరిట ప్రత్యేక కార్యక్రమం. దీనికి ప్రాథమికంగా రూ.500 కోట్లు కేటాయించారు.    
»    మదర్సాల ఆధునికీకరణకు రూ.100 కోట్లు.  
 »    పాఠశాలకు వెళ్లాల్సిన 5-11 ఏళ్ల లోపు పిల్లల్లో ప్రపంచవ్యాప్తంగా 5.78 కోట్ల మంది పిల్లలు పాఠశాలకు వెళ్లడం లేదు. వీరిలో మన దేశానికి చెందినవారు 14 లక్షల మంది ఉన్నారు. పాఠశాలకు వెళ్లని పిల్లలు అధికంగా ఉన్న తొలి అయిదు దేశాల జాబితాలో భారత్ కూడా ఉంది. 
ఉన్నత విద్య:     
»    ఉన్నత విద్యా రంగానికి ఈ బడ్జెట్‌లో రూ.25,456 కోట్లు కేటాయించారు. 2013 - 14 బడ్జెట్ సవరించిన అంచనాల ప్రకారం ఇది రూ.24,485 కోట్లు.    
»    దేశంలో కొత్తగా అయిదు ఐఐటీలు, అయిదు ఐఐఎంలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.    
»    కొత్త ఐఐటీలు జమ్మూ, చత్తీస్‌గఢ్, గోవా, ఆంధ్రప్రదేశ్, కేరళలో ఏర్పాటు చేయనున్నారు.    
»    ఐఐఎంలు హిమాచల్‌ప్రదేశ్, పంజాబ్, బీహార్, ఒడిశా, మహారాష్ట్రలో ఏర్పాటు చేయనున్నారు.   
»    మధ్యప్రదేశ్‌లో 'జయప్రకాశ్ నారాయణ్ నేషనల్ సెంటర్ ఫర్ హ్యుమానిటీస్' ఏర్పాటు.    
»    ఆన్‌లైన్ కోర్సులు, వర్చువల్ క్లాస్‌రూమ్‌ల ఏర్పాటుకు రూ.100 కోట్లు.    
»    విద్యా రుణాల నిబంధనల సరళీకరణకు నిర్ణయం.  
 »    యూపీఎస్‌సీకి ప్రస్తుత బడ్జెట్‌లో రూ.170 కోట్లు కేటాయింపు.    
»    ఉన్నత విద్యలో చేరుతున్న యువతీ యువకుల సంఖ్య 2.7 కోట్లు. దేశంలోని 18-23 ఏళ్ల వయసున్న యువతలో ఇది 17.21 శాతం. 2020 నాటికి ఈ సంఖ్యను 4.5 కోట్లకు (25శాతం) పెంచాలని యూజీసీ ప్రతిపాదించింది.

వ్యవసాయం:   
 »    2014-15 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయానికి రూ.31,062.94 కోట్లు కేటాయించారు. 2013-14 బడ్జెట్ సవరించిన అంచనాల ప్రకారం ఇది రూ.26,070.87 కోట్లుగా ఉంది.  
 »    ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చింది. బడ్జెట్‌లో వేర్వేరు వ్యవసాయ పథకాల కోసం రూ.7,500 కోట్లు ప్రకటించింది.  
 »    వ్యవసాయరంగంలో 4 శాతం వృద్ధి సాధనకు కట్టుబడి ఉన్నామని, సాగును లాభసాటిగా మారుస్తామనీ చెప్పారు. ఈ రంగంలో సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధికి, వాణిజ్య మౌలిక సౌకర్యాల కల్పనకు, ఆధునికీకరణకు ప్రభుత్వ, ప్రయివేటు రంగాల నుంచి పెట్టుబడులు రావాల్సిన అవసరం ఉందని మంత్రి ప్రకటించారు.    
»    నీటిపారుదల సౌకర్యాలను మెరుగుపరిచేందుకు 'ప్రధానమంత్రి కృషి సించయీ యోజన' పేరిట ప్రత్యేక పథకాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. దీనికోసం రూ.1000 కోట్లు కేటాయించారు.    
»    ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ పరపతి లక్ష్యం రూ.8 లక్షల కోట్లు.    
»    వ్యవసాయ రుణాలపై తిరిగి చెల్లింపులను సక్రమంగా చేసేవారికి ప్రస్తుతం అందిస్తున్న 3 శాతం వడ్డీ రాయితీ కొనసాగింపు.   
»    5 లక్షల రైతు సమూహాలకు 'భూమి హీన్ కిసాన్' పథకం కింద ఈ ఆర్థిక సంవత్సరంలో నాబార్డ్ ద్వారా రుణాలు.    
»    వ్యవసాయరంగంలో జాతీయ మార్కెట్ ఏర్పాటులో భాగంగా ప్రైవేట్ మార్కెట్ యార్డులు, ప్రైవేట్ మార్కెట్లు నెలకొల్పేందుకు చట్ట సంస్కరణల కోసం రాష్ట్రాలతో కలిసి కృషి చేస్తారు.    
»    రైతులు తమ ఉత్పత్తులను నేరుగా అమ్ముకునేందుకు పట్టణ ప్రాంతాల్లో రైతు మార్కెట్ల అభివృద్ధికి రాష్ట్రాలకు ప్రోత్సాహం.    
»    వ్యవసాయోత్పత్తుల ధరల అస్థిరత కారణంగా రైతులు కష్టనష్టాలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో రూ.500 కోట్లతో 'ధరల స్థిరీకరణ నిధి'.   
»    భారత వ్యవసాయ పరిశోధన సంస్థ తరహాలో అసోం, జార్ఖండ్‌లోనూ పరిశోధన కేంద్రాలు.    
»    ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్‌లో వ్యవసాయ విశ్వవిద్యాలయాలు; తెలంగాణ, హర్యానాలో ఉద్యాన విశ్వవిద్యాలయాల ఏర్పాటు. దీనికోసం రూ.200 కోట్ల నిధుల కేటాయింపు.   
»    రెండో హరితవిప్లవంలో భాగంగా 'ప్రొటీన్ల విప్లవం' సాధన.    
»    కిసాన్ వికాస్ పత్రాల పునరుద్ధరణ.    
»    దేశవ్యాప్తంగా వ్యవసాయ, గ్రామీణ రంగాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు నాబార్డ్ 'గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి (ఆర్ఐడీఎఫ్)' కార్పస్ నిధికి అదనంగా రూ.5 వేల కోట్లు పెంపుదల.    
»    2014-15 సంవత్సరానికి గాను శాస్త్రీయ గిడ్డంగుల సౌకర్యాల ఏర్పాటుకు రూ.5 వేల కోట్లు కేటాయింపు.    
»    వ్యవసాయంలో దీర్ఘకాలిక పెట్టుబడుల పరపతిని పెంచేందుకు దీర్ఘకాలిక గ్రామీణ పరపతినిధిని నాబార్డ్‌లో ఏర్పాటు. ఇందులో సహకార బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకు రుణసాయం కోసం ప్రాథమికంగా రూ.5 వేల కోట్లతో కార్పస్ నిధి ఏర్పాటు.   
»    2014-15 ఆర్థిక సంవత్సరంలో నాబార్డ్ స్వల్పకాలిక సహకార గ్రామీణ పరపతి రీఫైనాన్స్ నిధికి రూ.50 వేల కోట్లు ప్రతిపాదన.    
»    చిన్న కమతాల రైతులకు ప్రయోజనాలు కల్పించేందుకు ప్రొడ్యూస్ పేరిట రూ.200 కోట్లతో నాబార్డ్ కింద 'ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ డెవలప్‌మెంట్ ఫండ్‌'కు ప్రతిపాదన. వచ్చే రెండేళ్లలో దేశవ్యాప్తంగా 2 వేల ఉత్పత్తిదారుల సంస్థల నిర్మాణం.    
»    ఆర్గానిక్ ఆహారానికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఈశాన్య ప్రజలు వాణిజ్యపరమైన ఉత్పత్తి ద్వారా భారీ లాభాలు సాధించేందుకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.100 కోట్లు కేటాయింపు.    
»    ఎరువులను సమతుల పద్ధతుల్లో ఉపయోగించడాన్ని ప్రోత్సహించేందుకు రూ.100 కోట్లతో ప్రతి రైతుకూ భూసార ఆరోగ్య కార్డుల అందజేత.   
»    రూ.56 కోట్లతో 100 సంచార భూసార ప్రయోగశాలలు.    
»    వాతావరణ మార్పుల దుష్ప్రభావాలను ఎదుర్కొనేందుకు రూ.100 కోట్లతో 'జాతీయ సర్దుబాటు నిధి'.

విద్యుత్ రంగం:     
»    2014-15 సంవత్సరం కేటాయింపులు రూ.9,543.90 కోట్లు కాగా 2013-14 బడ్జెట్ సవరించిన అంచనాల ప్రకారం ఇది రూ.5,410.86 కోట్లు.  
 »    దేశాభివృద్థిలో విద్యుత్ రంగం అత్యంత కీలకమని భావిస్తున్న మోడీ ప్రభుత్వం తన తొలి బడ్జెట్‌లో పునరుత్పాదక, పర్యావరణహిత విద్యుదుత్పత్తికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది. భారీ స్థాయిలో సౌరవిద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులు, పార్కులు నెలకొల్పడానికి అనువైన వాతావరణాన్ని కల్పించేందుకు ప్రయత్నించింది. దీనికోసం ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.వెయ్యి కోట్లు కేటాయించారు. విద్యుదుత్పత్తి, పంపిణీ, సరఫరా రంగాల్లో పెట్టుబడులను ఆహ్వానించేలా పదేళ్లపాటు పన్ను మినహాయింపులనూ ప్రకటించారు.  
 »    సూర్యరశ్మి బాగా ఉండే రాజస్థాన్, గుజరాత్, తమిళనాడు, జమ్ము కాశ్మీర్‌లోని లడక్‌లలో అత్యధిక సామర్థ్యం ఉన్న (అల్ట్రా మెగా) సౌర విద్యుత్ ప్రాజెక్టులను స్థాపించాలని నిర్ణయించారు. దీనికోసం ప్రత్యేకంగా రూ.500 కోట్లు కేటాయించారు.    
»    వ్యవసాయానికి, తాగునీటి పంపింగ్‌కు వినియోగిస్తున్న సాధారణ మోటార్ల స్థానంలో సౌరవిద్యుత్‌తో నడిచే మోటార్లను వినియోగించడం. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇలాంటి లక్ష మోటార్లను మార్చాలన్న లక్ష్యాన్ని నిర్దేశించారు. ఇందుకు రూ.400 కోట్లు కేటాయింపు.    
»    కాలువ గట్లపై మెగావాట్ సామర్థ్యంగల సౌరవిద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు రూ.100 కోట్లు కేటాయించారు.   
»    గుజరాత్ తరహాలో నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరా కోసం ఫీడర్లను వ్యవసాయ, గృహ వినియోగ రకాలుగా విభజించనున్నారు. 'దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి యోజన'గా పిలిచే ఈ పథకాన్ని త్వరలోనే ప్రారంభించనున్నారు. దీనికి రూ.500 కోట్లు కేటాయించారు.  
»    విద్యుత్ కోతలతో సతమతమవుతున్న ఢిల్లీలో విద్యుత్ సంస్కరణల కోసం రూ.200 కోట్లు కేటాయింపు.    
»    2017, మార్చి 31 నాటికి విద్యుదుత్పత్తి పంపిణీ, సరఫరా ప్రారంభించే సంస్థలకు ఏడాది ప్రాతిపదికన కాకుండా పదేళ్లపాటు పన్ను విరామాన్ని (ట్యాక్స్ హాలిడే) విస్తరించడానికి ప్రతిపాదన.    
»    సంప్రదాయ, పునరుత్పాదక విద్యుత్‌ల అనుసంధానానికి గ్రీన్ ఎనర్జీ కారిడార్ ప్రాజెక్టు ప్రారంభం. తద్వారా పవన, సౌర విద్యుత్‌ను ఎక్కడ ఉత్పత్తి చేసినా దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావొచ్చన్నది ప్రభుత్వ యోచన.    
»    సౌర విద్యుత్ ఉత్పత్తిలో వినియోగించే ఫొటోవోల్టాయిక్ సెల్స్ దిగుమతుల ప్రోత్సాహక విధానంలో మార్పులు తీసుకురానున్నారు.   
»    ఫొటోవోల్టాయిక్ రిబ్బన్లలో వాడే రాగి తీగ తయారీదారులకు దిగుమతి సుంకాల్లో మినహాయింపులు.    
»    సౌర విద్యుత్ ఉత్పత్తి కోసం వినియోగించే యంత్రాలు, యంత్ర పరికరాలపై విధించే దిగుమతి సుంకాల తగ్గింపు 5 శాతం వరకూ విస్తరణ.    
»    2015 మార్చి నాటికి విద్యుదుత్పత్తి ప్రారంభించే థర్మల్ విద్యుత్ కేంద్రాలన్నింటికీ బొగ్గు సరఫరా సమస్య లేకుండా చూడటం.

కార్మిక, ఉపాధి కల్పన:   

 »    కార్మిక, ఉపాధి కల్పన శాఖకు ఈ బడ్జెట్‌లో రూ.2,496 కోట్లు కేటాయించారు. 2013-14 బడ్జెట్ సవరించిన అంచనాల ప్రకారం ఇది రూ.1723.16 కోట్లుగా ఉంది.    
»    ప్రస్తుతమున్న ఉపాధి కల్పన కార్యాలయాలను కెరీర్ సెంటర్లుగా ఆధునికీకరించేందుకు రూ.50 కోట్లు కేటాయించారు. ఈ కేంద్రాల వద్దకు వచ్చే విద్యార్థులకు కెరీర్‌కు సంబంధించిన కౌన్సెలింగ్ ఇస్తారు.    
»    అసంఘటిత కార్మికులకు సామాజిక భద్రత కల్పించేందుకు, మహిళా కార్మికుల భద్రత, పనితీరును మెరుగుపరచడానికి ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. 
పౌర విమానయాన రంగం:     
»    2014 - 15 ఆర్థిక సంవత్సరంలో రూ.9,474 కోట్లు కేటాయించారు. 2013-14 సవరించిన అంచనాల ప్రకారం ఇది రూ.8,502 కోట్లుగా ఉంది.   
»    మెట్రో, నాన్ మెట్రో నగరాలకు కూడా విమాన సర్వీసులను పెంచడానికి ప్రభుత్వ - ప్రయివేటు భాగస్వామ్య పద్ధతిలో విమానాశ్రయాలను అభివృద్ధి చేసేందుకు ఒక కొత్త పథకాన్ని ప్రకటించారు.    
»    ఎయిరిండియాకి రూ.7,069 కోట్లు, విమానాశ్రయాల ప్రాధికార సంస్థ (ఏఏఐ - ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా)కు రూ.2,134 కోట్లు కేటాయించారు. 

క్రీడల రంగం:    
»    ఎన్డీయే సర్కారు తన తొలి బడ్జెట్‌లో యువజన, క్రీడల శాఖకు నిధుల కేటాయింపును పెంచింది.    
»    2014 - 15 ఆర్థిక సంవత్సరానికి రూ.1769 కోట్లు కేటాయించారు. 2013 - 14 బడ్జెట్ సవరించిన అంచనాల ప్రకారం ఇది రూ.1207 కోట్లు.    
»    జమ్ము కాశ్మీర్‌లో క్రీడల సౌకర్యాల కల్పనకు రూ.200 కోట్లు కేటాయించారు.    
»    భారత క్రీడా ప్రాధికార సంస్థకు రూ.405.10 కోట్లు కేటాయించారు.    
»    రాజీవ్‌గాంధీ ఖేల్ అభియాన్‌కు కేటాయింపులు రూ.104.85 కోట్ల నుంచి రూ.20 కోట్లు కుదింపు.   
»    కామన్‌వెల్త్ క్రీడలు, ఏషియన్ గేమ్స్‌లలో భారత్ నుంచి ప్రాతినిధ్యం వహించేవారి సాధన ఏర్పాట్ల కోసం రూ.100 కోట్లు.    
»    డోపింగ్ వ్యతిరేక కార్యకలాపాల కోసం రూ.11.60 కోట్లు కేటాయించారు.

రక్షణ రంగం:     
»    ఎన్‌డీయే ప్రభుత్వం రక్షణరంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని పెంచింది. ప్రైవేటు రక్షణ కంపెనీల్లో ఎఫ్‌డీఐ పరిమితిని 26 శాతం నుంచి 49 శాతానికి పెంచుకునేందుకు అనుమతించింది.    
»    2014 - 15 తాజా బడ్జెట్‌లో రక్షణ రంగానికి రూ.2,29,000 కోట్లు కేటాయించారు. 2013-14 బడ్జెట్‌లో రక్షణకు రూ.2.03 లక్షల కోట్లు కేటాయించగా, ఈ ఏడాది తాత్కాలిక బడ్జెట్‌లో రూ.2,24,000 కోట్లు కేటాయించారు.  
 »    ఆధునిక ఆయుధాల కొనుగోలుకు కేటాయించిన రూ.89.5 వేల కోట్లకు అదనంగా మరో రూ.5 వేల కోట్లు ఇస్తున్నట్లు ప్రకటించారు.    
»    సరిహద్దుల్లో రైల్వే వ్యవస్థ అభివృద్ధికి రూ.1000 కోట్లు కేటాయించారు.    
»    'ఒకే క్యాడర్, ఒకే పెన్షన్‌'కు ఏటా అదనంగా రూ.1000 కోట్లు.    
»    ఢిల్లీలోని ఇండియా గేట్ ప్రిన్సెస్ పార్క్ వద్ద యుద్ధ స్మారక చిహ్నం నిర్మాణానికి రూ.100 కోట్లు.    
»    సరిహద్దుల్లో మౌలిక వసతులకు రూ.1000 కోట్లు. 

ఆదాయపు పన్ను రంగం   
 »    అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ అల్పాదాయ వర్గాలకు కాస్త ఉపశమనం ఇవ్వాలనుకుంటున్నట్లు ప్రకటించిన ఆర్థికమంత్రి 60 ఏళ్లలోపు వారికి కనీస ఆదాయ పరిమితిని రూ.2,00,000 నుంచి రూ. 2,50,000కు పెంచారు.    
»    ఇక 60 ఏళ్లు దాటిన పెద్దలకు ఆదాయ పరిమితిని ప్రస్తుతమున్న రూ.2,50,000 నుంచి రూ.3,00,000కు పెంచారు. దీనివల్ల ప్రతి ఒక్కరికి రూ.5 వేల మేరకు ప్రయోజనం కలుగుతుంది.  
 »    80 ఏళ్ల వయసువారికి ఆదాయపు పన్ను పరిమితిలో ఎలాంటి మార్పులు ప్రతిపాదించలేదు. వీరికి ప్రస్తుతం పన్ను వర్తించని ఆదాయ పరిమితి రూ.5 లక్షలు.    
»    ప్రస్తుత నిబంధనల ప్రకారం సెక్షన్ 80 సి కింద నిర్దేశిత పెట్టుబడులపై గరిష్ఠంగా రూ.లక్ష మేరకు మినహాయింపు లభిస్తోంది. పొదుపును ప్రోత్సహించే లక్ష్యంతో ఈ మినహాయింపు మొత్తాన్ని రూ.1,50,000 కు పెంచారు. అంటే గరిష్ఠ మొత్తానికి మదుపు చేసిన వారికి కనీసం రూ.5 వేల నుంచి గరిష్ఠంగా రూ.15 వేల వరకు కలిసి వస్తుంది.    
»    గృహ నిర్మాణ రంగానికి ప్రాధాన్యం ఇస్తూ సొంతింటి కోసం రుణం తీసుకున్నవారికి కొంత ఊరట కల్పించారు. గృహరుణంపై చెల్లించే వడ్డీకి సెక్షన్ 24 బి ప్రకారం గరిష్ఠంగా రూ.2 లక్షల మేరకు ఆదాయంలో నుంచి తగ్గించి చూపించుకోవచ్చు. ఇప్పటివరకూ ఇది రూ.1,50,000 గా ఉంది. దీనివల్ల కనీసం రూ.5 వేల నుంచి గరిష్ఠంగా రూ.15 వేల వరకూ ప్రయోజనం చేకూరనుంది.    
»    వ్యాపారులకు ప్రస్తుతం అమల్లో ఉన్న పన్ను నిబంధనల్లో ఎలాంటి మార్పులు చేయలేదు.

హోంశాఖ బడ్జెట్ పెంపు: 
* గతేడాదితో పోల్చితే ఈ ఏడాది హోంమంత్రిత్వ శాఖకు 11 శాతం నిధులు అధికంగా కేటాయించారు. 
తాజా బడ్జెట్‌లో ఈ శాఖకు రూ.65,745 కోట్లు కేటాయించగా, గతేడాది రూ.59,241 కోట్లు కేటాయించారు. 
* పెద్ద నగరాల్లో మహిళా భద్రతను పటిష్టపరిచేందుకు రూ.150 కోట్లను ప్రత్యేకంగా కేటాయించారు. 
* ఈ ఆర్థిక సంవత్సరంలో సీఆర్‌పీఎఫ్ దళాలకు రూ.12,169.51 కోట్లు, ఇంటెలిజెన్స్ బ్యూరోకు రూ.1176.43 కోట్లు, 
ఇమ్మిగ్రేషన్ బ్యూరోకు రూ.241.20 కోట్లు, జాతీయ పరిశోధన ఏజెన్సీకి రూ.101.03 కోట్లు కేటాయించారు. 
పట్టణాల అభివృద్ధికి ప్రాధాన్యం:     
»    పట్టణాలను నివాసయోగ్య ప్రాంతాలుగా తీర్చిదిద్దుతామని బడ్జెట్‌లో ప్రతిపాదించారు. 
రక్షిత తాగునీటి సదుపాయం కల్పించడం, మురుగునీటి నిర్వహణ, ఘన వ్యర్థాల నిర్వహణ, డిజిటల్ కనెక్టివిటీ లాంటి
 చర్యలు చేపడతామని ప్రకటించారు. 
నగరాల్లో రద్దీని తగ్గించేందుకు మెట్రో రైలు వ్యవస్థలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని చెప్పారు. 
2022 నాటికి అందరికీ సొంతిల్లు ఉండాలన్న లక్ష్యం మేరకు గృహ రుణాలపై అదనంగా పన్ను ప్రోత్సాహకం 
కల్పిస్తున్నట్లు జైట్లీ ప్రకటించారు. 

గ్రామీణుల చెంతకు తాగునీరు:     
»    కేంద్ర బడ్జెట్‌లో తాగునీటికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. దేశంలో సుమారు 20 వేల గ్రామాలను కలుషిత జలాల 
నుంచి కాపాడి రక్షిత మంచినీటిని అందించేందుకు జాతీయ గ్రామీణ నీటి సరఫరా పథకం ద్వారా రూ.3600 కోట్లను
 ప్రత్యేకంగా వ్యయం చేయాలని నిర్ణయించారు. 
సబ్సిడీల పెంపు స్వల్పం:     
»    బడ్జెట్‌లో సబ్సిడీల మొత్తాన్ని ఒక మోస్తరుగా 2.47 శాతం మేర పెంచారు.
 దీంతో ఇది రూ.2,51,397.25 కోట్లకు చేరుతుంది.    
»    ఆహార, పెట్రోలియం ఉత్పత్తుల సబ్సిడీలతో పాటు మొత్తం సబ్సిడీల విధానాన్ని సమగ్రంగా పరిశీలిస్తామని 
ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ప్రతిపాదించారు. 
అట్టడుగు వర్గాలకు, పేదలకు, ఎస్సీ, ఎస్టీలకు పూర్తి రక్షణ కల్పిస్తూనే అర్హులైన వారికే సబ్సిడీ అందేలా 
తీర్చిదిద్దుతామని ప్రకటించారు. కొత్త యూరియా విధానాన్ని కూడా రూపొందిస్తామని ప్రకటించారు.

స్వచ్ఛమైన భారతం (స్వచ్ఛ్ భారత్ అభియాన్):     
»    అపరిశుభ్ర వాతావరణంతో అల్లాడుతున్న గ్రామాల్లో నేటికీ అత్యధిక శాతం మంది ఆరుబయట మలమూత్ర విసర్జన
 చేయాల్సి వస్తోన్న పరిస్థితుల్లో కేంద్రం గ్రామీణ పరిశుభ్రతకు ఈ బడ్జెట్‌లో పెద్దపీట వేసింది. వచ్చే అయిదేళ్లలో 
దేశంలోని గ్రామీణ ప్రాంతాలన్నీ పరిశుభ్రతతో కళకళ్లాడేలా చేసే కార్యక్రమానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు 
ఆర్థికమంత్రి ప్రకటించారు. ప్రజల భాగస్వామ్యంతోనే ఇది సాకారమవుతుందని ఆకాంక్షించారు. 
మహాత్మాగాంధీ 150వ జయంతి జరుపుకునే 2019 నాటికల్లా దేశమంతా స్వచ్ఛంగా కనిపించడమే లక్ష్యమని 
పేర్కొన్నారు.    
»    ఈ మహోన్నత కార్యక్రమం పేరు 'స్వచ్ఛ్ భారత్ అభియాన్'.  
»    గత యూపీఏ ప్రభుత్వం ఇదే కార్యక్రమాన్ని 'నిర్మల్ భారత్ అభియాన్' పేరుతో మొదలుపెట్టినా 
2022 లక్ష్యంగా పెట్టుకుంది. మోడీ సర్కారు ఈ లక్ష్యాన్ని 2019 నాటికి నిర్దేశించింది.   
»    నిర్మల్ భారత్ అభియాన్ ప్రస్తుతం 607 జిల్లాల్లో అమలవుతోంది.    
»    11వ ప్రణాళికలో గ్రామీణ పారిశుద్ధ్యానికి రూ.6,540 కోట్లు కేటాయించగా 12వ ప్రణాళికలో ఏకంగా 
రూ.34,337 కోట్లు కేటాయించారు.    
»    నిజానికి కేంద్ర ప్రభుత్వం 1986 లోనే కేంద్ర గ్రామీణ పారిశుద్ధ్య పథకాన్ని ప్రవేశపెట్టి 
భారీగా రాయితీలు ప్రకటించినా పరిస్థితి ఏ మాత్రం చక్కబడలేదు.
 

డిజిటల్ ఇండియా  
 »    'డిజిటల్ ఇండియా' కార్యక్రమం కింద గ్రామీణ ప్రాంతాల్లోఅంతర్జాల (ఇంటర్నెట్సేవల మెరుగుదలకు
 గ్రామీణస్థాయిలో హార్డ్‌వేర్సాఫ్ట్‌వేర్ ఉత్పత్తులను ప్రోత్సహించడానికికేంద్రం రూ.500 కోట్లు కేటాయించింది.
   »    
 కార్యక్రమం కింద జాతీయ గ్రామీణ అంతర్జాల,సాంకేతిక సేవల మిషన్ ద్వారా గ్రామాల్లో అంతర్జాల  

సేవలనుమెరుగుపరచడంపై కేంద్రం దృష్టి సారిస్తుంది.
 ప్రభుత్వ సేవల్లోపారదర్శకత పెంచడంగ్రామాల్లోపాఠశాలల్లో ఐటీ శిక్షణఇవ్వడంప్రభుత్వ కార్యక్రమాలను 
సేవలను ప్రజలకు చేరువ చేయడం లాంటి వాటికి ఇదిఉపకరిస్తుంది 
అలాగే గ్రామీణ స్థాయిలో భారతీయ సాఫ్ట్‌వేర్హార్డ్‌వేర్ ఉత్పత్తులను ప్రోత్సహిస్తుంది. 
సాంకేతిక సేవా సంస్థలకు అవకాశాలను పెంచుతుంది.

ఈ - వీసా విధానం:     
»    మరింతమంది పర్యాటకులు మన దేశానికి వచ్చేందుకు వీలుగా తాజా బడ్జెట్‌లో ఈ-వీసా విధానాన్ని ప్రతిపాదించారు. తొమ్మిది విమానాశ్రయాల్లో విడతల వారీగా ఈ-వీసా విధానాన్ని అమలు చేయనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను ఆరు నెలల్లో అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ-వీసా విధానం కిందకు వచ్చే దేశాలను విడతల వారీగా ఎంపిక చేస్తారు. విదేశీయులు భారత్‌లోకి వచ్చిన వెంటనే వీసా ఇచ్చే (వీసా-ఆన్-అరైవల్) ప్రక్రియను ఈ-వీసా మరింత సులభతరం చేస్తుంది. 
'స్కిల్ ఇండియా' కార్యక్రమం:     
»    యువతకు వివిధ నైపుణ్యాలు నేర్పించేందుకుగాను 'స్కిల్ ఇండియా పేరుతో జాతీయ స్థాయిలో బహుళ నైపుణ్యాల అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని ప్రకటించారు. ఇందులో యువతకు ఉద్యోగ, వ్యాపార నైపుణ్యాలు నేర్పిస్తారు. వెల్డింగ్, వడ్రంగం, చేనేత లాంటి అనేక సంప్రదాయ వృత్తి శిక్షణలు అందిస్తారు.    
»    కొత్తగా వ్యాపారాలు, స్వయం ఉపాధి ప్రాజెక్టులు ప్రారంభించే గ్రామీణ యువతకు అండగా నిలిచే కార్యక్రమానికి బడ్జెట్‌లో రూ.100 కోట్లు కేటాయించారు.    
»    దేశంలోని ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజీలను కెరీర్ కేంద్రాలుగా మలచి తగిన ఉపాధి అవకాశాలు చూపడం; శిక్షణ, కౌన్సెలింగ్ ఇస్తూ మార్గదర్శనం చేసేందుకు రూ.100 కోట్లు కేటాయించారు. ఈ చర్యలన్నీ ఉద్యోగ, ఉపాధి కల్పన దిశగా వేసిన అడుగులుగా నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఎఫ్‌డీఐలను ఆహ్వానించడం కూడా కొలువుల సృష్టికి తోడ్పడుతుందని, పర్యాటక, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, బ్యాంకింగ్, రిటైల్ రంగాల్లో అవకాశాలు పెరుగుతాయని చెబుతున్నారు.    
»    బడ్జెట్‌లో ప్రతిపాదించిన ఈ చర్యలతో వచ్చే మూడు నాలుగేళ్లలో వివిధ రంగాల్లో 50 లక్షల నుంచి 80 లక్షల మంది యువతకు ఉద్యోగాలు లభించే అవకాశమున్నట్లు అంచనా.

 నమామి గంగ:     
»    పవిత్ర గంగానది పరిరక్షణ కోసం తాజా బడ్జెట్‌లో రూ.2,037 కోట్లు ప్రతిపాదించారు. గంగానది పరిరక్షణ కోసం 'నమామి గంగ' పేరిట ఒక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. ఇప్పటివరకూ గంగానది అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున నిధులు వెచ్చించినప్పటికీ సరైన కృషి లేక ఆశించిన ఫలితాలు రాలేదు.    
»    గంగానది అభివృద్ధికి ప్రవాస భారతీయుల నుంచి మంచి స్పందన రావడంతో వారి నుంచి మద్దతు కూడగట్టే విధంగా త్వరలో గంగానదీ ప్రవాస భారతీయ నిధి (ఎన్ఆర్ఐ ఫండ్ ఫర్ గంగ)ను ఏర్పాటు చేయనున్నారు. ఈ నిధితో ప్రత్యేక ప్రాజెక్టులను చేపడతారు.    
»    కేదార్‌నాథ్, హరిద్వార్, కాన్పూర్, వారణాసి, అలహాబాద్, పాట్నా, ఢిల్లీల్లో నదీ తీర సుందరీకరణ, ఘాట్‌ల అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయించారు.    
»    దేశంలో నదుల అనుసంధానంపై అధ్యయనం చేయడానికి రూ.100 కోట్లు కేటాయించారు. దీంతో నదుల అనుసంధానానికి సంబంధించి సమగ్ర నివేదికను తయారుచేస్తారు. 
కిసాన్ టీవీ:    »    రైతులకు అవసరమైన తాజా సమాచారాన్ని అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా 'కిసాన్ టీవీ'ని ఆరంభించనుంది. ఇందుకోసం 2014-15 బడ్జెట్‌లో రూ.100 కోట్లు కేటాయించింది. కొత్త వ్యవసాయ పద్ధతులు, నీటి సంరక్షణ, సేంద్రియ వ్యవసాయం లాంటి అంశాలకు సంబంధించిన తాజా విషయాలను అందించడం కిసాన్ టీవీ ఉద్దేశం. వ్యవసాయరంగం, దాని అనుబంధ రంగాల ప్రయోజనాల కోసం ఇది పనిచేస్తుంది. ఈ కొత్త ఛానెల్‌ను ఆరంభించడంపై ప్రసార భారతి ఇప్పటికే పనిచేస్తోంది. 

జౌళి రంగానికి ఊతం:     
»    తాజా బడ్జెట్‌లో జౌళి రంగానికి ఊతం ఇచ్చేలా దేశవ్యాప్తంగా కొన్ని భారీ టెక్స్‌టైల్ క్లస్టర్లను ప్రతిపాదించారు. వాణిజ్య కేంద్రాలు, క్రాఫ్ట్ మ్యూజియాల నిర్మాణానికి రూ.50 కోట్లు కేటాయించారు. వీటితో వారణాసి, ఇతర హస్తకళలకు ప్రాచుర్యం కల్పించనున్నారు.    
»    బరేలీ, లక్నో, సూరత్, కచ్, భాగల్‌పూర్, మైసూర్, తమిళనాడుల్లో టెక్స్‌టైల్ క్లస్టర్ల కోసం రూ.200 కోట్లు కేటాయించారు.   
»    ఢిల్లీలో ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్యంతో హస్తకళా అకాడమీని ఏర్పాటు చేయాలని బడ్జెట్‌లో ప్రతిపాదించారు.    
»    పష్మినా (ఉన్ని) ప్రాచుర్య కార్యక్రమం, జమ్మూ కాశ్మీర్‌లోని ఇతర కళల అభివృద్ధికి రూ.50 కోట్లు కేటాయించారు.

100 స్మార్ట్ సిటీలు:     
»    దేశంలో 100 నగరాలను ఆధునిక సదుపాయాలతో స్మార్ట్ సిటీలుగా తీర్చిదిద్దడానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.7060 కోట్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది.    
»    పెద్ద నగరాలను ఆనుకుని ఉన్న ప్రాంతాలు, చిన్నతరహా పట్టణాలను కేంద్రం ఈ పథకం కింద ఎంపిక చేస్తుంది. గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాలకు వలసలు పెరుగుతున్న నేపథ్యంలో దీన్ని ప్రకటించింది. ఈ రంగంలో పెట్టుబడులను ఆకర్షించడం కోసం కొన్ని నిబంధనలను సడలించింది. 
అమర జవాన్ల భారీ స్మారక స్థూపం:   
 »    ఢిల్లీలో ఇండియా గేట్ వద్ద ఉన్న ప్రిన్సెస్ పార్కులో అమర జవాన్ల కోసం భారీ స్మారక స్థూపాన్ని, యుద్ధ మ్యూజియాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం బడ్జెట్లో రూ.100 కోట్లు కేటాయించారు.    
»    జాతీయ పోలీసు స్మారక కేంద్రానికి రూ.50 కోట్లు కేటాయించారు. 

సేవా పన్ను పరిధి పెంపు:    
»    తాజా బడ్జెట్‌లో సేవా పన్ను పరిధిని పెంచారు. పరోక్ష పన్నుల ద్వారా ఎక్కువ ఆదాయాన్ని ఆర్జించడానికి ప్రయత్నిస్తున్న ప్రభుత్వం సేవా పన్ను పరిధిని పెంచింది. పరోక్ష పన్నుల ద్వారా అదనంగా రూ.7,525 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాలని ప్రభుత్వం భావిస్తోంది. రేడియో ట్యాక్సీల సేవలను కూడా పరోక్ష పన్నుల కిందికి తీసుకొచ్చారు.    
»    సేవా పన్నుల ద్వారా రూ.2.16 లక్షల కోట్లు ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 

బయో టెక్నాలజీకి ఊతం:     
»    శాస్త్ర సాంకేతిక రంగాలకు బడ్జెట్‌లో ప్రాధాన్యం లభించింది. ముఖ్యంగా బయోటెక్నాలజీపై ప్రత్యేక దృష్టి పెట్టారు.    
»    ఫరీదాబాద్, బెంగళూరుల్లోని బయోటెక్నాలజీ క్లస్టర్లను అంతర్జాతీయ ప్రమాణాల మేరకు తీర్చిదిద్దుతారు. జన్యు ఇంజినీరింగ్ బయోటెక్నాలజీ రంగాలకు మరింత ఊతం.  
 »    మొహాలీ లోని వ్యవసాయ - బయోటెక్ క్లస్టర్‌ను మరింత మెరుగుపరచి, ప్లాంట్ - జెనెటిక్, ఫెనోటైప్ విభాగాలను జోడిస్తారు. ప్రభుత్వ - ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) ద్వారా మొహాలీలో సెకండరీ వ్యవసాయానికి ఊతం. దీనికి తోడు పుణె, కోల్‌కతాల్లో రెండు కొత్త క్లస్టర్ల ఏర్పాటు.  
 »    ఢిల్లీలోని అంతర్జాతీయ జన్యు ఇంజినీరింగ్, బయోటెక్నాలజీ కేంద్రాన్ని అంతర్జాతీయ స్థాయికి అభివృద్ధి చేసేందుకు ప్రపంచ భాగస్వామ్యాల అభివృద్ధి.    
»    భూశాస్త్ర, వాతావరణ రంగాల్లో పరిశోధన కోసం భూ అధ్యయన శాస్త్ర విభాగానికి రూ.1699 కోట్లు.   
»    సాగర పరిశోధన కోసం రూ.629 కోట్లు కేటాయించారు.

ఇస్రోకు పెరిగిన కేటాయింపులు:     
»    వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత అంతరిక్ష పరిశోధన రంగానికి ప్రభుత్వం కూడా జోరుగా నిధులు కేటాయించింది. గతేడాది బడ్జెట్‌తో పోలిస్తే ఈసారి ఏకంగా 50 శాతం మేర కేటాయింపులు పెంచి, రూ.6 వేల కోట్లు ఇచ్చింది. 2013-14లో తొలుత రూ.5,615 కోట్లు కేటాయించిన తర్వాత దీన్ని సవరించి రూ.4 వేల కోట్లకు పరిమితం చేశారు.    
»    తాజా కేటాయింపుల్లో ఎక్కువ భాగం రూ.3,545.63 కోట్లు అంతరిక్ష పరిజ్ఞానానికి వెళ్తాయి. ఇన్‌శాట్ ప్రాజెక్టు కోసం రూ.1412.98 కోట్లు కేటాయించారు.   
»    2014-15లో భవిష్యత్ తరం భారీ వాహక నౌక జీఎస్ఎల్‌వీ మార్క్ - 3 ప్రయోగాత్మక పరీక్ష పీఎస్ఎల్‌వీ వాహక నౌక వాణిజ్య ప్రయోగం, రెండు నావిగేషనల్ ఉపగ్రహాల ప్రయోగం ఉంటాయి.    
»    జీఎస్ఎల్‌వీ మార్క్ - 3 కోసం రూ.378.76 కోట్లు. చంద్ర మండల అన్వేషణ కార్యక్రమం చంద్రయాన్ కోసం రూ.60 కోట్లు.    
»    అంగారక పరిశోధన ఉపగ్రహం (మామ్) ఈ ఏడాది సెప్టెంబరు 24న అంగారక కక్ష్యలోకి ప్రవేశం. ఈ ప్రాజెక్టు కోసం తాజా బడ్జెట్‌లో రూ.65.63 కోట్లు కేటాయింపు. 

నేషనల్ అడాప్టేషన్ ఫండ్:    
»    వాతావరణ మార్పులపై చర్యలకు రూ.100 కోట్లతో జాతీయ నిధి (నేషనల్ అడాప్టేషన్ ఫండ్)ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు.    
»    పర్యావరణ మంత్రిత్వ శాఖకు రూ.2,043 కోట్ల కేటాయింపు. గతేడాది రూ.2430 కోట్లు కేటాయించారు. ప్రస్తుతం బొగ్గు, లిగ్నైట్ లాంటి వాటిపై పర్యావరణ అనుకూల ఇంధన సెస్‌ను విధిస్తున్నారు. ఇలా సమకూరే ఆదాయాన్ని పర్యావరణ అనుకూల ఇంధనాన్ని ప్రోత్సహించేందుకు, ఆ రంగంలో పరిశోధనకు ఉపయోగిస్తున్నారు.

స్టాక్ మార్కెట్ల ఊతానికి చర్యలు:     
»    స్టాక్ మార్కెట్లలో మరింత ఉత్సాహం నింపడం కోసం ఈ బడ్జెట్‌లో ప్రభుత్వం పలు చర్యలను ప్రకటించింది.    
»    అంతర్జాతీయ ఇండియన్ డెట్ సెక్యూరిటీల సెటిల్‌మెంట్‌కు ఆమోదం తెలిపారు. అదే సమయంలో ఇండియన్ డిపాజిటరీ రిసీట్స్ (ఐడీఆర్)లను పూర్తిగా మార్చి భారత్ డిపాజిటరీ రిసీట్స్ (బీహెచ్‌డీఆర్)ను తీసుకువస్తున్నారు. ఏడీఆర్, జీడీఆర్‌ల విధానాన్ని సరళీకరిస్తున్నారు.    
»    రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్స్ (ఆర్ఈఐటీ)లకు ప్రోత్సాహకాలు ప్రకటించారు.   
»    విదేశీ మదుపర్లకు విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపర్ల (ఎఫ్‌పీఐ) పేరిట ఒక కొత్త విభాగాన్ని సృష్టించారు. సెక్యూరిటీల్లో వీరు జరిపే లావాదేవీల వల్ల వచ్చే ఆదాయాన్ని మూలధన లాభంగా పరిగణిస్తామని ప్రకటించారు. ఈ కొత్త విధానం జూన్ 1 నుంచి అమల్లోకి వస్తుంది.    
»    రుణ ఆధారిత మ్యూచువల్ ఫండ్లపై దీర్ఘకాల మూలధన పన్నును 10 శాతం నుంచి 20 శాతానికి సవరించారు. అయితే దీర్ఘకాల డెట్ ఫండ్ యూనిట్లను అట్టిపెట్టి ఉంచుకునే వ్యవధిని 12 నెలల నుంచి 36 నెలలకు పెంచారు. ఈ సవరణలు 2015, ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయి.

సర్దార్ పటేల్ విగ్రహానికి రూ.200 కోట్లు:    
»    ఐక్యతకు చిహ్నంగా గుజరాత్‌లో భారీ ఎత్తున నిర్మించతలపెట్టిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి కేంద్ర బడ్జెట్‌లో రూ.200 కోట్ల నిధులు కేటాయించారు. గుజరాత్ ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయించగా మిగిలిన మొత్తాన్ని విరాళాలుగా సమీకరిస్తున్నారు.   »    ప్రధాని మోడీ ఈ విగ్రహ నిర్మాణాన్ని ప్రతిష్ఠాత్మకంగా భావించడం గమనార్హం.ఉన్నతాధికారుల శిక్షణకు రూ.205 కోట్లు:    »    దేశంలో సమర్థ పాలనకు ఉద్దేశించి కేంద్ర సచివాలయ ఉన్నతాధికారుల శిక్షణ కోసం సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల మంత్రిత్వ శాఖకు తాజా బడ్జెట్‌లో కేంద్రం రూ.205.66 కోట్లు కేటాయించింది.   »    సచివాలయ శిక్షణ, నిర్వహణ సంస్థ (ఐఎస్‌టీఎం), లాల్‌బహదూర్ శాస్త్రి జాతీయ పాలన సంస్థ (ఎల్‌బీఎస్ఎన్ఏఏ)ల ఏర్పాటుకు ఈ మొత్తాన్ని ప్రకటించింది.
ఎంఎస్ఎంఈ లకు జవసత్వాలు
:    »    సూక్ష్మచిన్నమధ్యతరహా పరిశ్రమలకు జవసత్వాలు కల్పించడానికి బడ్జెట్‌లో అనేకచర్యలను మోడీ ప్రభుత్వం ప్రకటించిందిముఖ్యంగా ప్రారంభ కంపెనీలను ప్రోత్సహించడంపై దృష్టిసారించింది.
   »    
సూక్ష్మచిన్నమధ్య స్థాయి పరిశ్రమల (ఎంఎస్ఎంఈరంగంలో ప్రారంభ కంపెనీల కోసంరూ.10,000 కోట్లతో వెంచర్ క్యాపిటల్ ఫండ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు
.వాటాల విక్రయంతో రూ.63,400 కోట్లు:
   »    
ప్రభుత్వప్రభుత్వేతర కంపెనీల్లో తనకున్న వాటాను విక్రయించడం ద్వారా ప్రస్తుత ఆర్థికసంవత్సరంలో రూ.63,400 కోట్లు సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందిగత ప్రభుత్వంమధ్యంతర బడ్జెట్‌లో నిర్దేశించిన రూ.56,925 కోట్ల కంటే  మొత్తం అధికం
.
   »    
యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా స్పెసిఫైడ్ అండర్ టేకింగ్‌లో వాటా సహా ప్రభుత్వ రంగ కంపెనీల్లోవాటా విక్రయం ద్వారా రూ.43,425 కోట్లుప్రభుత్వేతర కంపెనీల్లోని వాటా విక్రయం ద్వారారూ.15,000 కోట్లుగత ఆర్థిక సంవత్సరం ప్రారంభించిన సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్‌ప్రైజెస్ ఎక్స్ఛేంజీట్రేడెడ్ ఫండ్ ద్వారా రూ.5,000 కోట్లు సమీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
బ్యాంకులకు రూ.2.4 లక్షల కోట్లు:
   »    ప్రభుత్వరంగ బ్యాంకుల్లో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా భారీ ఎత్తున నిధులు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. బ్యాంకులకు మరింత స్వేచ్ఛ కల్పించడంతోపాటు 'బాసెల్ 3' ప్రమాణాలకు అనుగుణంగా వీటిని నిర్వహించేందుకు 2018 నాటికి రూ.2.40 లక్షల కోట్ల మూలధనం సమకూర్చాల్సి ఉంటుంది. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా, తన వాటాను ప్రభుత్వం తగ్గించుకుంటుంది. అయితే బ్యాంకులపై నియంత్రణకు అవసరమైన 51 శాతం మేర వాటాను ప్రభుత్వం కలిగి ఉంటుంది.
విద్యుత్ వెలుగులు   »    విద్యుత్ రంగానికి బడ్జెట్‌లో తగిన ప్రాధాన్యాన్ని ఇచ్చారు.
   »    సమర్థమైన థర్మల్ విద్యుత్తు రంగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో 'అత్యాధునిక సూపర్ క్రిటికల్ కోల్ బేస్‌డ్ థర్మల్ పవర్ టెక్నాలజీ' పథకాన్ని ఆర్థిక మంత్రి ప్రకటించారు. దీనికి ప్రాథమికంగా రూ.100కోట్లు కేటాయించారు. మరోపక్క దేశీయంగా బొగ్గు లభ్యత పెంపొందించే లక్ష్యంతో పలు చర్యలను ప్రతిపాదించారు.
   »    విద్యుత్తు రంగానికి పదేళ్ల పన్ను విరామం వెసులుబాటును మరో ఏడాదిపాటు పొడిగించాలని మంత్రి బడ్జెట్‌లో ప్రతిపాదించారు.
'3 పీ ఇండియా':
   »    మౌలిక సదుపాయాల కల్పనలో నిధుల లభ్యత ప్రధానమైన సమస్య. దీన్ని అధిగమించడానికి రూపొందించిన 

విధానమే ప్రభుత్వ - ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ). దీనివల్ల అత్యాధునిక విమానాశ్రయాలు, 
అద్భుతమైన జాతీయ రహదార్లు నిర్మించే అవకాశం లభించింది. అయితే అదే సమయంలో ఈ విధానంలో ఎన్నో లోపాలు, లొసుగులు బయటపడ్డాయి. అందువల్ల ఈ విధానాన్ని కొత్త రకంగా తీర్చిదిద్దాలని, లోటుపాట్లు సవరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
   »    '3 పీ ఇండియా' అనే పేరుతో రూ.500 కోట్లతో ఒక సంస్థను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ - ప్రైవేట్ ప్రాజెక్టులకు సంబంధించిన విధి విధానాలు, అమలు లాంటి వివిధ అంశాలపై ఈ సంస్థ అధ్యయనం చేసి ఆచరణాత్మకమైన మార్పులు, చేర్పులు సూచిస్తుందని భావిస్తున్నారు.
 

నౌకాశ్రయాల అనుసంధానం:
   »    నౌకా రవాణాను ప్రోత్సహించే దిశగా నౌకాశ్రయాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. దీనివల్ల వర్తకం వృద్ధి చెందుతుందని, ఉద్యోగావకాశాలు పెరుగుతాయని మంత్రి అభిప్రాయపడ్డారు.
   »    నౌకాశ్రయాలను అనుసంధానం చేయడానికి 16 నౌకాశ్రయాల అభివృద్ధి ప్రాజెక్టులను ఈ ఏడాదిలో చేపట్టనున్నట్లు ప్రకటించారు.
   »    ట్యూటికోరిన్ మొదటి అవుటర్ హార్బర్ ప్రాజెక్టుకు రూ.11,635 కోట్లు కేటాయించారు. కాండ్లా, జేఎన్‌పీటీలలో ఎస్ఈజడ్‌లు ఏర్పాటు చేస్తారు.
   »    'జల్ మార్గ్ వికాస్' పేరుతో అలహాబాద్ - హల్దియా మధ్య 1620 కిలోమీటర్ల దూరం ఉన్న జల మార్గాన్ని అభివృద్ధి చేస్తామని మంత్రి ప్రకటించారు. ఆరేళ్లలో పూర్తి చేయాలనుకుంటున్న ఈ ప్రాజెక్టుకు రూ.4200 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా.
సీబీఐకి పెరిగిన కేటాయింపులు   »    కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కు 2014 - 15 ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ కేటాయింపులు రూ.520.56 కోట్లకు పెరిగాయి. 2013 - 14తో పోలిస్తే ఇది 17% అధికం. ఇ-పాలన, శిక్షణ కేంద్రం ఆధునికీకరణ, సాంకేతిక విభాగాల ఏర్పాటు, కార్యాలయాల నిర్మాణం తదితర అవసరాల కోసం బడ్జెట్‌లో కేటాయింపులు చూపించారు.
   »    అవినీతి నిరోధక వ్యవస్థ - లోక్‌పాల్‌కు వ్యవస్థాపన ఖర్చుల నిమిత్తం బడ్జెట్‌లో రూ.2 కోట్లు కేటాయించారు.

 కస్టమ్స్ సుంకం లక్ష్యం పెంపు    
»    ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.2,01,819 కోట్ల మేరకు కస్టమ్స్ సుంకాన్ని వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. గతేడాది రూ.1,75,056 కోట్ల సుంకాన్ని వసూలు చేసింది.
    

»    సమాచార సాంకేతిక ఒప్పందం కిందకు రాని టెలి కమ్యూనికేషన్స్ ఉత్పత్తులకు 10% కస్టమ్స్ సుంకాన్ని ప్రతిపాదించారు.
    

»    సహజ వనరుల పరిరక్షణను దృష్టిలో పెట్టుకుని బాక్సైట్ ఎగుమతులను నియంత్రించేందుకు వీలుగా బాక్సైట్ ఎగుమతి సుంకాన్ని 10 నుంచి 20 శాతానికి పెంచారు.ఇతర అంశాలు   »    ఆర్థిక మంత్రిగా అరుణ్‌జైట్లీ ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ ఇదే.   »    అరుణ్‌జైట్లీ పంజాబ్‌కు చెందినవారు.   »    2014 ఎన్నికల్లో అమృత్‌సర్ నుంచి పోటీచేసి ఓటమి చెందారు.    
»    మోడీ సర్కారు ప్రవేశపెట్టిన తొలి సాధారణ బడ్జెట్‌కు చిన్న అపశ్రుతి ఎదురైంది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నడుం నొప్పి కారణంగా బడ్జెట్ ప్రసంగానికి 5 నిమిషాలపాటు ఆటంకం ఏర్పడింది. కూర్చొని బడ్జెట్ పాఠాన్ని చదవడం బహుశా దేశ పార్లమెంట్ చరిత్రలో ఇదే ప్రథమం కావచ్చు.   »    తాజా బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అభివృద్ధి అనే పదాన్ని 31 సార్లు, పెట్టుబడులు అనే పదాన్ని 34 సార్లు ఉపయోగించారు.


No comments:

Post a Comment